Showing posts with label నీతి కథలు. Show all posts
Showing posts with label నీతి కథలు. Show all posts

Wednesday, 31 October 2012

ఉంగరం దొంగ ఎవరు?


ఉంగరం దొంగ ఎవరు?
ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకోని తన దగ్గర దాచిపెట్టాడు.

ఈ సంగతులు ఏవీ కూడ బీర్బల్‌కు తెలియవు. ప్రతి రోజు వచ్చినట్లు గానే ఆరోజు కూడా రాజ్య సభకు వచ్చాడు. బీర్బల్‌ను చూడగానే అయనకు తాను వేసుకున్న పధకం గుర్తుకు వచ్చింది. అందుకని నవ్వు వచ్చిందన్న మాట. అంతే కాదు ఈ సమస్యను బీర్బల్ ఏలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది. "బీర్బల్ ఈ రోజు నామనస్సు ఏమి బాగాలేదు." అన్నాడు రాజు గారు "ఏమైనది మహారాజా!" కంగారుగా అడిగాడు బీర్బల్. బీర్బల్‌కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది. అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి. మరి అట్లాంటి రాజుగారు "నామనసు బాగాలేదు" అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు? మనమైన అంతే కదా! మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతాం కదా! అలాగే బీర్బల్‌ కూడా రాజుగారి మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్న మాట.

"చెప్పండి మహారాజా! మీ మనసు ఎందుకు బావుండలేదు? ఎవరు మీ మనసును బాధపెట్టింది?" అని అడిగాడు బీర్బల్. అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు. బీర్బల్‌కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. "మీమనసు ఎందుకు బావుండ లేదు?" అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్. "మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ!" అని అడిగాడు అక్బర్. అందుకు బీర్బల్ అవునన్నట్లుగా తల ఆడించాడు.

"బీర్బల్! ఒక సారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది." అన్నాడు అక్బర్. చక్రవర్తి చెప్పినట్టుగానే చేసాడు బీర్బల్. "ఊఁ ఏమైనా అర్థం అయిందా!" అడిగాడు అక్బర్ చక్రవర్తి. "అర్థం అయ్యింది మహారాజా! మీ సమస్య ఏమిటో తెలిసింది" అన్నాడు. "అయితే చెప్పు మా సమస్య?" అడిగాడు అక్బర్. మీ మధ్య వ్రేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా!" అన్నాడు బీర్బల్. బీర్బల్ సునిశిత దృషికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు. "అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు."అన్నాడు అక్బర్. "ఎక్కడైనా భద్రంగా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!"

"లేదు బీర్బల్ నాకు గుర్తుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను. చేతికి ఉంగరం ఉంది. బాత్‌రూమ్‌కు వెళుతూ తీసి పక్కన పెట్టాను. నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది." అని చెప్పాడు. చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు. ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు. "ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది." "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి." అడిగాడు బీర్బల్. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు." అన్నాడు అక్బర్ చక్రవర్తి. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెప్పరు అందరూ మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత అక్బర్ "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది అన్నాడు. "చెప్పండి మహారాజా! నేను ఏం చేయాలో చెప్పండి." అడిగాడు బీర్బల్. "బీర్బల్! నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దోంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి." చెప్పాడు అక్బర్. రాజుగారు చెప్పినదానికి బీర్బల్ ఒప్పుకున్నాడు." మహారాజా మీరు బాత్‌రూమ్‌కు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి." అని అడిగాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్‌ను ఓ అలమారు దగ్గరకు తీసుకునివెళ్ళాడు. "ఇదిగో ఇక్కడే పెట్టాను" అంటూ ఆ స్థలం చూపించాడు. బీర్బల్ ఆ అలమర దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు. "ఆహఁ! అలాగా! సరే... సరే..." అన్నాడు.

బీర్బల్ ఏమిచేస్తున్నాడో అక్కడ ఉన్నవాళ్ళకి అర్థం కాలేదు. బీర్బల్ నిలబడిన తీరు 'ఆహా! అలాగా! ఓహొ! అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెపుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది. షుమారు ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ అలమర దగ్గరనుండి ఇవతలకు వచ్చాడు. "ఉంగరం దొంగ దొరికాడు మహారాజా!" అన్నాడు. "చెప్పు బీర్బల్! ఎవారా దొంగ త్వరగా చెప్పు. రాజుగారి ఉంగరాని తీసేటంత ధైర్యం ఉన్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి. ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి." అన్నాడు.

"మహారాజా" ఈ అలమార ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారో అని అతను ఖంగారు ఖంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ ఖంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుని పోయిందట. మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాల్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు అలమారలో చిక్కుకుని పోయాయట. కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి." అని అన్నాడు బీర్బల్. బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను ఖంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు. "మహారాజా! దొంగ దొరికాడు" అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్‌కు చెప్పాడు. అంత కచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవ్వరికి అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"మరేమి లేదు మహారాజా! మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు. నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను. అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది. వెంటనే అలమర దగ్గరకు వెళ్ళి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను. అక్కడి నుంచి ఇవతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలమారలో చిక్కుకుని పోయింది అని కల్పించి చెప్పాను. నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు. అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను. అయితే మీరు ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు." అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.

అతి పండితుడు


అతి పండితుడు
వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. ' ఎందుకని?' అడిగాడు బోధిసత్వుడు (పండితుడు) ఆశ్చర్యపడుతూ. అందుకతడు ' నువ్వు పండితుడివి మాత్రమే నేను అతిపండితుడిని కదా! అందుకు ' అన్నాడు.

'సరుకులూ... ఎద్దులూ... బళ్ళూ మనవి సమాన భాగాలు కదా? నీకు రెండువంతులెందుకు రావాలి?' అడిగాడు పండితుడు. 'అతిపండితుడిని అవడంవల్ల' అన్నాడతను. వారి దెబ్బలాట ముదిరింది. అప్పుడు అతిపండితుడు దీనికొక ఉపాయముంది. నాకు రెండు భాగములు వచ్చుట న్యాయమోకాదో వృక్షదేవత చెప్పును. రేపు వృక్షదేవతనే అడుగుదాం. అది చెప్పినట్లే చేద్దాం. మనలో మనకి తగవెందుకు? అన్నాడు.

ఆ రాత్రి అతిపండితుడు తన తండ్రినొక చెట్టు తొర్రలో పెట్టి "మేము రేపు వచ్చి అడిగినప్పుడు ' అతి పండితుడు రెండు భాగములకు అర్హుడు అని చెప్పు ' అంటూ ఆదేశమిచ్చాడు. మర్నాడు అతిపండితుడు, పండితుని వృక్షము వద్దకు కొనిపోయి వృక్షదేవతా! మాతగవు తీర్చుము. అందుకు నువ్వే తగినదానవు" అన్నాడు. సంగతి చెప్పండి అన్నాడు తొర్రలో ఉన్న అతను గొంతుకను కొంత మార్చి. ఇతను పండితుడు, నేనో అతి పండితుడిని. అని మొదలుపెట్టి జరిగినదంతా వృక్షానికి విన్నవించాడు అతి పండితుడు. మా వ్యాపారంలో వచ్చిన లాభంతో ఎవరెవరికెంత రావాలో సెలవియ్యి అన్నాడు చివరగా.

పండితునకొక భాగము, అతిపండితునకు రెండు భాగములు అని వినిపించింది చెట్టులోంచి. అప్పుడు పండితునిగా ఉన్న బోధిసత్వుడు దేవతా రూపమో మరొకటో యిప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించాడు. అగ్నిజ్వాలలు వ్యాపించే సరికి అతిపండితుని తండ్రి సగం ఒళ్ళు కాలి కుయ్యో మొర్రో మంటూ బయటకు వచ్చి పండితునిగా ఉండడమే మంచిది. అతిపండితుడవడం చాలా హానికరం. నాకొడుకు అతి పండితుడు కాబట్టి నన్ను అగ్నిపాలు చేశాడు. అని మీరిద్దరూ సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం. అని చెప్పాడు. ఇద్దరూ వ్యాపారంలో లాభాలను సమంగా పంచుకున్నారు.


    నీతి: కుటిలత్వానికి తానేకాక తనవారు కూడా బలవుతారు.

Sunday, 28 October 2012

ఆత్మవిశ్వాసము


ఆత్మవిశ్వాసము
కళింగ, విదర్భ రాజ్యాలు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలుపడుతూ వుండేవారు. విదర్భసైన్యము పెద్దది. కళింగసైన్యము తక్కువ. కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి అవమానమనీ తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు.

సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి "మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. ఈ విషయంలో కాళీమాత సంకల్పము ఎలా వుందో తెలుకుందాం" అని వెండి నాణెము తీసి చూపించి "నేను బొమ్మా బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే కాళీమాత దీవించినట్టే. విజయము మనదే. బొరుసుపడితే ఓటమిగా తీసుకుందాం" అని నాణెము కుడి చేతిలోకి పైకి ఎగురవేశాడు.

నేలమీదపడిన నాణెముపై రాజముద్రిక కనిపించగానే వారిలో ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకుసాగింది. గెలుపుతమదేననే ఆత్మవిశ్వాసము కలిగింది. శత్రుసైనికులను చీల్చి చెండాడి విజయాన్ని కైవసము చేసుకున్నారు. యుద్ధము ముగిసిన తర్వాత అల్ప సంఖ్యాకులమయిన మనం విజయం సాధించటం ఆశ్చర్యముగా వుంది అన్న దళనాయకునితో సేనాధిపతి విక్రమ్ నవ్వుతూ తాను కాళికాదేవి ఆలయము వద్ద బొమ్మా బొరుసు వెండి నాణెము చూపించాడు. రెండువైపులా రాజముద్రిక వుండటం గమనించి తిరిగి సేనాధిపతి విక్రమ్‌కి ఇచ్చాడు.

మూలం: పిల్లల నీతి కధలు, నండూరి భాగ్యలక్ష్మి, సరస్వతి పబ్లికేషన్స్.

అభిమాని


అభిమాని
అభిమానం చాలా చిత్రమైనది. ప్రేమ గుడ్డిది అంటారు. అలాగే ఈ అభిమానం కూడా గుడ్డిదేనని చెప్పాలి. కత్తి పండ్లు కోసుకొని తినడానికే పనికి వస్తుంది.అలాగే ఆ అభిమానం మనుషుల మధ్య అనుబంధానికి దారి తీస్తుంది. మనుషుల పతనానికీ దారి తీస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ! "అతి సర్వత్రావర్ష్యమేత"అని అన్నారు పెద్దలు. మంచి అయినా, చెడ్డ అయిన ఒక స్థాయివరకూ పరవాలేదు. ఆ స్థాయి దాటితే ముప్పు తప్పదు కదా. అటువంటి సమయాల్లో తమని అభిమానించే వారిని పెడదోవ పెట్టనీకుండా సరైన సలహా ఇచ్చి, వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత అభిమానింపబడే వారిలోనూ వుంది. అందుకు ఉదాహరణే ఈ కథ.

పదవ తరగతి చదువుతున్న మహేష్‌కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను విడవకుండా చదువుతాడు. చక్రపాణిగారిని చూడాలని మఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్‌కి. ఆయన ఉండేది హైదరాబాదులో కాబట్టి అక్కడికి వెళ్ళేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి, తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం వుండదు కనుక ఊరకుండిపోయాడు.

అదృష్టవశాత్తు చక్రపాణిగారు ఆ ఊరిలో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకురానీయరని గుర్తుకొచ్చి తనలోతానే బాధపడ్డాడు.

ఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కాకొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణిగారిని చూసి, ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేం ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయట పడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకున్నాడు.

సభ పూర్తయిన తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణిగారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి, తనను పరిచయం చేసుకున్నాడు. "సార్! నేను ఈ ఊరి హైస్కూల్లోనే టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ ప్రక్కన పెట్టి మిమ్మల్ని చూడటానికి వచ్చాను" అని గొప్పగా చెప్పాడు.

మహేష్ చివరిమాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణిగారు. అది గమనించిన మహేష్, "ఏంటిసార్! అలా ఉన్నారు" అని అడిగాడు.

"బాబూ మహేష్ నీవు నా అభిమానివైనందుకు సంతోషం. కానీ ఇప్పుడు నీవు చేసిన పని బాగులేదు. ఎందుకంటే ఈ వయస్సులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి, ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు, నేనూ గర్వపడతాను" అని చెప్పారు చక్రపాణిగారు.

ఆయన మాటలను ఆలోచిస్తూ తానుచేసింది తప్పేననిపించింది మహేష్‌కి. వెంటనే ఇకముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణిగారికి మాట ఇచ్చి, ఇంటికొచ్చి చదవటంలో నిమగ్నయ్యాడు మహేష్.

మూలం: బాలమిత్ర.